పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
A2 న్యూస్, జూన్ 29, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ (28) ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం 0 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోలియో నిర్మూలనలో పల్స్ పోలియో కార్యక్రమం అత్యంత కీలకమైందని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి కుటుంబం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారిని సమీపంలోని పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.
ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలకు దూరం కాకుండా అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పోలియో చుక్కలు పూర్తిగా సురక్షితమైనవని, చిన్నారుల ఆరోగ్య రక్షణకు అత్యంత ప్రభావవంతమైనవని తెలిపారు. జిల్లాలోని అన్ని పోలియో కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కేంద్రాలకు రాలేని చిన్నారులకు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రతి చిన్నారి పోలియో చుక్కలు తీసుకునే వరకు అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ గణేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, ఇతర వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

