రోడ్డు ప్రమాదాలు, సైబర్-ఆర్థిక నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి– మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
A2న్యూస్, జులై 15, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా (14) జిల్లాలో నమోదయ్యే ప్రతి కేసులో వేగవంతంగా, నాణ్యమైన దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్-గ్రేవ్, మిస్సింగ్, ఎన్బీడబ్ల్యూ కేసులను నిర్ణీత గడువులో పూర్తి చేసి చార్జ్షీట్లు దాఖలు చేయాలని సూచించారు. ముఖ్యంగా గ్రేవ్ కేసుల్లో శాస్త్రీయ ఆధారాలను సేకరించి నిందితులకు శిక్ష పడేలా దర్యాప్తు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను శ్రద్ధగా విని చట్టబద్ధమైన పరిష్కారం అందించాలని ఎస్పీ సూచించారు. ప్రతి గ్రామానికి విలేజ్ పోలీసు అధికారిని నియమించి, రౌడీషీటర్లు, కేడీలు, అనుమానితుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, ఆర్థిక నేరాలు, సైబర్ మోసాలపై గ్రామాలు, పట్టణాల్లో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఆర్థిక నేరాల నియంత్రణలో భాగంగా వాహన తనిఖీలు (వెహికల్ చెకింగ్), నాకాబందీని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. బ్లూ కోల్ట్స్, నైట్ పెట్రోలింగ్ సిబ్బంది పాపిలాన్ పరికరాల ద్వారా అనుమానితుల వివరాలను సేకరించాలని ఆదేశించారు.
జిల్లాలో నేరాల నియంత్రణకు కమ్యూనిటీ భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్న ఎస్పీ, ప్రతి గ్రామంలోని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, దుకాణాలు, ప్రార్థనా స్థలాలు, పరిశ్రమలు, పెట్రోల్ బంకులు తదితర కీలక ప్రాంతాల్లో కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్హెచ్వోలకు సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీలు ప్రసన్న కుమార్, సుభాష్ చంద్ర బోస్, సీఐలు రేణుక, రాజశేఖర్ రెడ్డి, వెంకట రాజా గౌడ్, మహేష్, జార్జ్, సందీప్ రెడ్డి, కృష్ణమూర్తి, ఎస్ఐలు మరియు జిల్లా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

