A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 28:
మెదక్ జిల్లా (27) ఓటర్ జాబితాలో నమోదైన తమ వివరాలను ప్రతి ఒక్కరూ సరిచూసుకోవాలని ఆర్డీవో రమాదేవి సూచించారు. గురువారం మెదక్ పట్టణంలోని 133, 134 పోలింగ్ కేంద్రాల్లో ఓటరు జాబితాలో వివరాల పరిశీలన, సవరణలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో రమాదేవి మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన అర్హులైన యువతీ యువకులు కొత్త ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే ఓటరు జాబితాలో పేరు, వయస్సు, చిరునామా, ఫొటో, బంధుత్వ వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నా లేదా సవరణలు అవసరమైనా ఫారం–8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రజలు, బీఎల్ఓలు, బీఎల్ఏలు, సంబంధిత అధికారులు ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు సక్రమంగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ పేరు, ఇతర వివరాలు జాబితాలో సరిగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, అధికారులు, బీఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు.

