ఘనంగా చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలు
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 11:
మెదక్ జిల్లా (10) చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్వో అంబదాస్ రాజేశ్వర్ కలిసి చాకలి ఐలమ్మ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చెరగని ముద్ర వేసిన గొప్ప మహిళా యోధురాలని అన్నారు. సామాజిక అన్యాయం, జమీందారీ వ్యవస్థ, దోపిడీకి వ్యతిరేకంగా ఆమె ధైర్యంగా పోరాడి అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. 1895లో జన్మించిన చాకలి ఐలమ్మ నిరుపేద కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూనే ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాటం చేశారని తెలిపారు. విస్నూర్ దేశ్ముఖ్ దోపిడీకి వ్యతిరేకంగా ఆమె చేసిన సాహసోపేతమైన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. స్వాతంత్ర్య ఉద్యమం, రైతాంగ ఉద్యమాల్లో ఆమె పోషించిన పాత్ర మహిళల ధైర్యసాహసాలకు నిదర్శనమని కొనియాడారు. సమాజంలో అసమానతలను తొలగించడంతో పాటు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

