A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) ఆగస్టు 10:
మనోహరాబాద్ (9) మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో బోనాల పండుగను గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవతలైన అమ్మవార్లకు మహిళలు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని, పాడి పశువులు ఆరోగ్యంగా ఉండాలని అమ్మవార్లను భక్తులు వేడుకున్నారు. తమ మొక్కులను చెల్లించుకుని అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించారు.
బోనాల పండుగ సందర్భంగా మనోహరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనాలని ఆకాంక్షించారు. బోనాల పండుగను పురస్కరించుకుని గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

