A2న్యూస్, జూలై 14, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా (13) నేటి యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి నరసింహారెడ్డి సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం మెదక్ పట్టణంలోని సిద్ధార్థ జూనియర్ కళాశాలలో జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు, వాటి వినియోగం వల్ల వ్యక్తిగత జీవితం, కుటుంబం, సమాజంపై పడే దుష్పరిణామాల గురించి వివరించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి నరసింహారెడ్డి మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని అన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో విద్యను అభ్యసించి, ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు. మత్తు పదార్థాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎక్సైజ్ సీఐ నాగేశ్వరరావు, డీటీఎఫ్ సీఐ జే. గోపాల్, మెదక్ ఎస్ఐ బి. మాన్సింగ్, సిబ్బంది సందీప్, మధుసూదన్ రెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

