ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో 23 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
జూన్ 26 నుంచి జూలై 4 వరకు దరఖాస్తుల స్వీకరణ – జూలై 6న డెమో, ఇంటర్వ్యూలు
– జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
A2 న్యూస్, జూన్ 26, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ 25: మెదక్ జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో 2026–27 విద్యా సంవత్సరానికి పార్ట్టైం ప్రాతిపదికన బోధనా సిబ్బంది నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిధిలోని మెదక్, తూప్రాన్, రామాయంపేట, కుల్చారం గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అలాగే టీజీఎస్డబ్ల్యూఆర్డీసీ (మహిళలు) మెదక్ డిగ్రీ కళాశాలలో మొత్తం 23 ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఖాళీల్లో జూనియర్ లెక్చరర్లు (తెలుగు, ఇంగ్లిష్, బోటనీ), పీజీటీలు (తెలుగు మినహా మిగిలిన అన్ని సబ్జెక్టులు), టీజీటీలు (తెలుగు, హిందీ, ఫిజికల్ సైన్స్, బయోసైన్స్), ఫిజికల్ డైరెక్టర్, పీఈటీ, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో నిర్దేశిత విద్యార్హతలు కలిగి ఉండాలని సూచించారు. గురుకుల విద్యాసంస్థల నిబంధనల ప్రకారం మహిళా విద్యాసంస్థలలో మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వబడుతుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు 2026 జూన్ 26 నుంచి జూలై 4 వరకు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ ప్రతులతో దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం 2026 జూలై 6న ఉదయం 10 గంటలకు మెదక్లోని టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్/జేసీ (బాలుర) ప్రాంగణంలో సబ్జెక్టు నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో డెమో, ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం జిల్లా సమన్వయకర్త అనురాధను 90595 26124 నంబర్లో సంప్రదించవచ్చని సూచించారు.

