మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలి — తూప్రాన్ సీఐ వెంకటరాజ గౌడ్
A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) సెప్టెంబర్ 13:
మనోహరాబాద్ (12) వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని తూప్రాన్ సీఐ వెంకటరాజ గౌడ్ శనివారం సూచించారు. మనోహరాబాద్ మండల ఎస్సై సుభాష్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన పీస్ కమిటీ సమావేశానికి సీఐ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఉత్సవాల ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు ప్రతి ఒక్కరూ శాంతియుతంగా వ్యవహరించాలని కోరారు. వినాయక మండపాల వద్ద విద్యుత్ వైర్ల విషయంలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఉత్సవాలను సజావుగా నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని తెలిపారు. సమావేశానికి మనోహరాబాద్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి వినాయక మండపాల నిర్వాహకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.