ప్రభుత్వ పథకాలు.. రాయితీలు పొందేందుకు యూడీఐడీ కీలకం
మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో శిబిరం.. 147 మంది దివ్యాంగులకు వైద్య పరీక్షలు
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 30 :
మెదక్ జిల్లా (29) దివ్యాంగుల సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, రాయితీలు, వివిధ సౌకర్యాలు అర్హులైన వారికి సులభంగా అందేందుకు యూనిక్ డిజెబిలిటీ ఐడీ (యు డి ఐ) డి కార్డు కీలకమని మెదక్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, డాక్టర్ శివదయాల్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శనివారం దివ్యాంగుల కోసం యూడీఐడీ శిబిరాన్ని నిర్వహించారు. యూడీఐడీ కార్డుల జారీ ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి 175 స్లాట్లు కేటాయించగా 147 మంది దివ్యాంగులు హాజరయ్యారు. 28 మంది గైర్హాజరయ్యారు. శిబిరంలో లోకోమోటర్ డిజెబిలిటీ విభాగంలో 66 మంది, జనరల్ మెడిసిన్లో 26 మంది, ఆప్తాల్మాలజీలో 18 మంది, ఈఎన్టీలో 20 మంది, సైకియాట్రీలో 12 మంది, పీడియాట్రిక్స్ విభాగంలో 5 మంది దివ్యాంగులు వైద్య పరీక్షలకు హాజరయ్యారు. వివిధ వైద్య విభాగాలకు చెందిన నిపుణులు దివ్యాంగులను పరీక్షించి, వారి వైకల్య శాతాన్ని నిర్ధారించారు. అర్హులైన వారికి యూడీఐడీ కార్డుల జారీకి అవసరమైన ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. యూడీఐడీ కార్డు దివ్యాంగులకు ప్రత్యేక గుర్తింపుతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాయితీలు, ఇతర సౌకర్యాలను సులభంగా పొందేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. దివ్యాంగులు యూడీఐడీ కార్డు ప్రాముఖ్యతను గుర్తించి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దివ్యాంగుల సంక్షేమం, సాధికారత కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు.