A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 8:04 am Posted by : A2TV NEWS

మహిళల భద్రతకు షీ టీమ్స్‌ నిరంతర నిఘా

జిల్లా వ్యాప్తంగా 5 పెట్టీ కేసులు నమోదు

వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 1:

మెదక్‌ జిల్లా (31) మహిళలు, యువతులు, విద్యార్థినుల భద్రతకు జిల్లా పోలీస్‌ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. మహిళలను వేధించడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడటం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు జిల్లాలో షీ టీమ్స్‌ నిరంతరం నిఘా కొనసాగిస్తున్నాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో 33 అవగాహనా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కార్యక్రమాల ద్వారా మహిళలు, విద్యార్థులకు మహిళల భద్రత, వేధింపుల నివారణ, సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. మహిళలు తమకు ఎదురయ్యే వేధింపులపై భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. షీ టీమ్స్‌ నిఘాలో వేధింపులకు పాల్పడుతున్న 62 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. వీరిలో 57 మందికి కౌన్సెలింగ్‌ నిర్వహించగా, 5 పెట్టీ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిపారు. బహిరంగ ప్రదేశాలు, విద్యాసంస్థలు, రద్దీ ప్రాంతాల్లో షీ టీమ్స్‌ నిఘాను మరింత పటిష్టం చేస్తామని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. మహిళలు, బాలికల భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. వేధింపులు లేదా అసభ్యకర ప్రవర్తన ఎదురైతే ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.