– రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
Aన్యూస్, జులై 7, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ (6) రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో కార్యక్రమం పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూన్ 25 నుంచి ప్రారంభమైన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ తుది దశకు చేరుకుందని తెలిపారు. పంపిణీ చేసిన ఫారాలను ఓటర్ల నుంచి తిరిగి స్వీకరించి, అందులోని వివరాలను సంబంధిత బీఎల్వో యాప్లో డిజిటైజేషన్ చేయాలని సూచించారు. ఫారాల పూరణలో ఓటర్లకు వాలంటీర్ల సహకారం అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. డిజిటైజేషన్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జూలై 20 నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. అనంతరం పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ చేపట్టి, ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,200 మందికి మించి ఓటర్లు ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక సమగ్ర సవరణలో తప్పుడు సమాచారం సమర్పించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిజిటైజేషన్ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులకు సూపర్వైజర్లు, వాలంటీర్లు సహకారం అందించాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటివరకు 95 శాతం ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని, 6.8 శాతం డిజిటైజేషన్ పూర్తయిందని తెలిపారు. వచ్చే సోమవారం నాటికి 50 శాతం డిజిటైజేషన్ పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ను పకడ్బందీగా నిర్వహిస్తామని, బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్లతో కార్యాచరణ ప్రకారం సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఆర్డీఓ రమాదేవి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ గఫర్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, ఎన్నికల శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.