A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 5:44 am Posted by : A2TV NEWS

మత్తు పదార్థాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి

గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

మత్తు పదార్థాల రవాణాపై కఠిన చర్యలు: ఎస్పీ డీవీ శ్రీనివాసరావు

A2న్యూస్, జూలై 23, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ (22) జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో మత్తు పదార్థాల నిర్మూలనపై విస్తృత ప్రచారం నిర్వహించి, యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడాలని సూచించారు. బుధవారం జిల్లా సమీకృత కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్తో కలిసి ఎక్సైజ్, పోలీసు, వైద్య శాఖ అధికారులతో మత్తు పదార్థాల నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలు, రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాఠశాలలకు 100 మీటర్ల పరిధిలో పాన్ షాపులు, గుట్కా, పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ, వైద్య శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి మత్తు పదార్థాలు, పొగాకు ఉత్పత్తుల అక్రమ విక్రయాలను అరికట్టాలని చెప్పారు. COTPA చట్టం కింద యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు చైతన్యం కల్పించాలని ఆదేశించారు. మత్తు పదార్థాల వినియోగం సమాజానికి తీవ్రమైన ముప్పుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మత్తు పదార్థాల నివారణపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఎంహెచ్‌ఓ గణేశ్వర్, జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి, డీఎస్పీ ప్రసన్నకుమార్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.