A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 4:54 pm Posted by : A2TV NEWS

లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం

A2 న్యూస్, జూన్ 16, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి: మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు

ఈ నెల 20వ తేదీ శనివారం నిర్వహించనున్న రెండవ జాతీయ మెగా లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డి.వి. శ్రీనివాస రావు కోరారు. రాజీ ద్వారా పరిష్కరించదగిన వివిధ కేసులను పరస్పర అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ ఉత్తమ వేదికగా నిలుస్తుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన వివాదాలు, కుటుంబ, వైవాహిక సంబంధిత కేసులు, బ్యాంకు రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం కేసులు, చెక్ బౌన్స్ కేసులు తదితర అంశాలను లోక్ అదాలత్ ద్వారా రాజీ పద్ధతిలో పరిష్కరించుకోవచ్చన్నారు. చిన్న చిన్న వివాదాలను పెద్ద కక్షలుగా మార్చుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, ధనం వృథా చేసుకోవద్దని సూచించారు. “రాజీయే రాజమార్గం” అనే భావనతో న్యాయశాఖ కల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని తమ వివాదాలకు శాశ్వత పరిష్కారం పొందాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది రాజీ పడదగిన కేసులను గుర్తించి, ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించడం ద్వారా అవగాహన కల్పిస్తారని తెలిపారు. తమ కేసుల్లో రాజీ కావాలనుకునే వారు సంబంధిత పోలీస్ అధికారులను సంప్రదించాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు త్వరితగతిన న్యాయం అందుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్నేహపూర్వక వాతావరణంలో వివాదాలను ముగించుకోవాలని ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు విజ్ఞప్తి చేశారు.