కొత్తపల్లి బ్రిడ్జి వద్ద రాకపోకలకు ఊరట
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 13:
పాపన్నపేట (12) పాపన్నపేటకు వెళ్లే ప్రధాన మార్గంలోని కొత్తపల్లి బ్రిడ్జి వద్ద దెబ్బతిన్న రహదారికి మరమ్మతులు చేపట్టడంతో వాహనదారులు, ప్రయాణికులకు ఊరట లభించింది. బ్రిడ్జి నిర్మాణం జరిగిన నాటి నుంచి రహదారి దెబ్బతినడంతో ఏళ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాలు కురిసిన సమయంలో రహదారి పరిస్థితి మరింత అధ్వానంగా మారి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడేది.
ఈ సమస్యపై దృష్టి సారించిన మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు వెంటనే స్పందించారు. ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు కలగకుండా కొత్తపల్లి బ్రిడ్జి వద్ద దెబ్బతిన్న రహదారికి మరమ్మతులు చేపట్టాలని పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్గౌడ్ను ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసుల ఆధ్వర్యంలో బ్రిడ్జి వద్ద దెబ్బతిన్న రహదారికి మరమ్మతులు చేపట్టి వాహనాల రాకపోకలకు అనుకూలంగా తీర్చిదిద్దారు. దీంతో చాలా కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికులు, ప్రయాణికులకు కొంతమేర ఊరట లభించింది.
ప్రజల సమస్యను గుర్తించి వెంటనే స్పందించి రహదారి మరమ్మతులకు చర్యలు తీసుకున్న జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావుకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు తక్షణమే స్పందించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.