A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 6:27 am Posted by : A2TV NEWS

ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 4:

మెదక్ (3) ఎస్ఐఆర్  ఎన్యుమరేషన్ ఫారమ్‌ల డిజిటలైజేషన్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సోమవారం సాయంత్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ డిజిటలైజేషన్‌తో పాటు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) ప్రక్రియపై జిల్లాల వారీగా సమీక్షించారు. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో నమోదై ఉంటే, వారిని ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. ప్రతి కుటుంబానికి చెందిన ఓటర్లందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా హేతుబద్ధీకరణ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒకే కుటుంబంలోని ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్రంలో నమోదయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డిజిటలైజేషన్ ప్రక్రియను ఒకటికి రెండుసార్లు పరిశీలించి ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) నగేష్, ఆర్డీఓ రామకృష్ణ, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, ఎలక్షన్ సూపరింటెండెంట్ సింగ్‌తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.