3.72 కోట్ల విలువైన 1,267.452 మెట్రిక్ టన్నుల ధాన్యం అక్రమ విక్రయం ఆరోపణలు.. నలుగురు అరెస్ట్
A2న్యూస్, మెదక్ జిల్లా/చేగుంట ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 18:
చేగుంట (17) కొండాపూర్ గ్రామ శివారులోని భద్రకాళి మాడ్రన్ రైస్ మిల్ యాజమాన్యంపై ప్రభుత్వ వడ్లను మిల్లింగ్ చేయకుండా విక్రయించి ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు కేసు నమోదైంది. తెలంగాణ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 2024-25 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి మిల్లింగ్ కోసం కేటాయించిన వడ్లలో 1,267.452 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేయకుండా విక్రయించినట్లు అధికారులు ఆరోపించారు. విక్రయించిన ధాన్యం విలువ సుమారు రూ.3.72 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు మెదక్ జిల్లా సివిల్ సప్లై కార్పొరేషన్ మేనేజర్ జగదీష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో భద్రకాళి మాడ్రన్ రైస్ మిల్ యాజమాన్యానికి చెందిన రంగమ్మ గారి శ్రీకాంత్ రెడ్డి, రంగమ్మ గారి ఉపేందర్ రెడ్డి, రంగమ్మ గారి వేణుగోపాల్ రెడ్డి, కారింగుల చంద్రశేఖర్ రెడ్డిలను రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. సైదా ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.