A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 7:30 am Posted by : A2TV NEWS

పదోన్నతితో బాధ్యత మరింత పెరుగుతుంది

పదోన్నతి పొందిన పోలీసులకు ర్యాంక్‌ చిహ్నాలు అలంకరించిన ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

A2న్యూస్, జూలై 26, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

అల్లాదుర్గ్ (25) పోలీసు శాఖలో పదోన్నతులు ఉద్యోగులకు గౌరవంతో పాటు బాధ్యతలను కూడా మరింత పెంచుతాయని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అన్నారు. అల్లాదుర్గ్ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న గాలయ్య ఎస్‌ఐగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు గాలయ్యకు ఎస్‌ఐ ర్యాంక్‌ చిహ్నాలను అలంకరించి అభినందనలు తెలిపారు. అదేవిధంగా నర్సాపూర్‌లో హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఆర్. తుకారాం, ఈ. వీరన్నలు ఏఎస్సైలుగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా వారు జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలవగా, ఎస్పీ వారికి ఏఎస్సై ర్యాంక్‌ చిహ్నాలను అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, “పదోన్నతితో బాధ్యతలు మరింత పెరుగుతాయి. ప్రజలకు మరింత చేరువగా ఉంటూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలి. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తూ పోలీసు శాఖపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా పనిచేయాలి” అని సూచించారు. పదోన్నతి పొందిన అధికారులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తమపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు.