వ్యవసాయ సన్నాహాలు, రైతు సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష
A2న్యూస్ జులై 8, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా (7) జిల్లాలో ఖరీఫ్ సీజన్ వ్యవసాయ సన్నాహాలు, రైతులకు అవసరమైన వ్యవసాయ ఇన్పుట్ల సరఫరా, ప్రభుత్వ రైతు సంక్షేమ పథకాల అమలుపై జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సకాలంలో అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంటల సాగు పురోగతి, వర్షపాతం పరిస్థితులు, నీటి లభ్యత, ఎరువుల నిల్వలు, పంటల్లో తెగుళ్లు, కీటకాల ఉద్ధృతి వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించి, అవసరమైన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
వ్యవసాయ అధికారులు గ్రామస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ రైతులకు శాస్త్రీయ సాగు విధానాలు, సమతుల్య ఎరువుల వినియోగం, నేల పరీక్షల ప్రాధాన్యం, సూక్ష్మపోషకాల వినియోగం, నీటి యాజమాన్యంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి, ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత పాటించాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో సంయుక్త వ్యవసాయ సంచాలకులు, జిల్లా వ్యవసాయ అధికారి, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.