A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 6:37 am Posted by : A2TV NEWS

పిల్లల మధ్య సరైన ఎడం – ఆరోగ్యకరమైన కుటుంబానికి ఆధారం: కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, జులై 14, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా (13) “పిల్లల మధ్య సరైన ఎడం – ఆరోగ్యకరమైన కుటుంబానికి ఆధారం” అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న ఉచిత కుటుంబ నియంత్రణ సేవలను అర్హులైన దంపతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జూలై 11 నుంచి 18 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెదక్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో శాశ్వత, తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు (ట్యూబెక్టమీ, వాసెక్టమీ, గర్భనిరోధక మాత్రలు తదితర స్పేసింగ్ పద్ధతులు) అనుసరిస్తున్న కుటుంబాలను కలెక్టర్ శాలువాలతో సత్కరించి అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, పిల్లల మధ్య సరైన అంతరం పాటించడం ద్వారా తల్లి, శిశువు ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు కుటుంబం ఆరోగ్యవంతంగా, ఆర్థికంగా బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. కుటుంబ నియంత్రణ సేవలపై అపోహలను వీడి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందిస్తున్న సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. జయశ్రీ, మాస్ మీడియా అధికారి అన్వర్ తదితరులు పాల్గొన్నారు.