A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 6:31 am Posted by : A2TV NEWS

గర్భిణీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా/చేగుంట ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 16:

చేగుంట (15) గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై వైద్యాధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. ముఖ్యంగా నెలలు నిండుతున్న గర్భిణీలు, హైరిస్క్ గర్భిణీలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం చేగుంటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని వివిధ గదులు, మెడికల్ స్టోర్‌ను పరిశీలించారు. అలాగే వైద్యుల హాజరు పట్టికను తనిఖీ చేసి, సిబ్బంది సమయపాలనపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. నెలలు నిండుతున్న గర్భిణీల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. హైరిస్క్ గర్భిణీల కేసులను గుర్తించి, వారికి అవసరమైన వైద్య సేవలు అందించడంతో పాటు, అవసరమైన సందర్భాల్లో జిల్లా ఆసుపత్రితో సమన్వయం చేసుకుని ట్యాగ్ చేయాలని ఆదేశించారు. పేదలకు మెరుగైన వైద్యం అందేలా వైద్య సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని, విధులకు సమయపాలనతో హాజరు కావాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రి పరిసరాలు, గదులు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.