పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 8:
మెదక్ జిల్లా (7) ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిశీలించి, సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 61 దరఖాస్తులు అందాయి. వీటిలో భూభారతికి సంబంధించి 22, ఇందిరమ్మ ఇళ్లకు 9, పెన్షన్లకు 5, ఇతర సమస్యలకు సంబంధించి 25 దరఖాస్తులు ఉన్నాయి. అనంతరం సీఎం ప్రజావాణితో పాటు జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులపై కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిశీలించి, నిర్ణీత సమయంలో సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు జాప్యం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. అధికారులందరూ సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.