A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 1:
మెదక్ జిల్లా (31) మెదక్ జిల్లా పరిధిలోని అన్ని రేషన్ కార్డుదారులు ప్రభుత్వం అందిస్తున్న మూడు నెలల రేషన్ బియ్యం కోటాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద సూచించారు. ప్రభుత్వం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్–2026 నెలలకు సంబంధించిన మూడు నెలల బియ్యం కోటాను ఒకేసారి పంపిణీ చేస్తున్న నేపథ్యంలో, రేషన్ కార్డుదారులు ఆగస్టు 1 నుంచి తమ సమీప ఫెయిర్ ప్రైస్ షాప్ (ఎఫ్పీఎస్)కు వెళ్లి మూడు నెలల బియ్యాన్ని తప్పనిసరిగా పొందాలని తెలిపారు. అదేవిధంగా, రేషన్ కార్డులో నమోదైన ప్రతి సభ్యునికి ఆగస్టు 31లోపు ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేయించుకోవాలని సూచించారు. చిన్నారుల ఈ-కేవైసీని ఐరిస్ (Iris) డివైస్ ద్వారా సులభంగా పూర్తి చేయవచ్చని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ సేవలు నిరంతరంగా అందాలంటే కుటుంబ సభ్యులందరి ఈ-కేవైసీని తప్పనిసరిగా పూర్తి చేయించుకోవాలని పేర్కొన్నారు.
ఎఫ్పీఎస్ డీలర్లకు ప్రత్యేక ఆదేశాలు
మెదక్ జిల్లా పరిధిలోని అన్ని ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్లు ఆగస్టు 1 నుంచి నిర్ణీత సమయానికి దుకాణాలను తెరిచి, మూడు నెలల బియ్యాన్ని లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా పంపిణీ చేయాలని జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద ఆదేశించారు. అలాగే, ఈ-కేవైసీ పెండింగ్లో ఉన్న ప్రతి లబ్ధిదారునికి వ్యక్తిగతంగా సమాచారం అందించి, ఆగస్టు 31లోపు 100 శాతం ఈ-కేవైసీ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారుల ఈ-కేవైసీని ఐరిస్ డివైస్ ద్వారా పూర్తి చేయించాలని తెలిపారు. ప్రతి గ్రామంలో మైక్ అనౌన్స్మెంట్ ద్వారా మూడు నెలల బియ్యం పంపిణీ, ఈ-కేవైసీ పూర్తి చేయాల్సిన అంశాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, ప్రతిరోజూ బియ్యం పంపిణీతో పాటు ఈ-కేవైసీ ప్రక్రియను సమాంతరంగా నిర్వహించి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందించాలని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద తెలిపారు.