A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 8:
నర్సాపూర్ (7) అసెంబ్లీ వద్ద మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పట్ల పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్ లో భారాస శ్రేణులు భగ్గుమన్నారు. ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ సోమవారం అసెంబ్లీ వద్ద నల్లదుస్తులతో నిరసనకు దిగిన కేటీఆర్, హరీశ్రావు తదితర నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ తోపులాటలో ఎమ్మెల్యే సునీతారెడ్డి పట్ల పోలీసులు అత్యంత దారుణంగా, అవమానకరంగా వ్యవహరించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గులాబీ శ్రేణులు పోలీసుల తీరు, రేవంత్ సర్కార్ నిరంకుశ పాలనను నిరసిస్తూ నర్సాపూర్ ఆర్టీసీ బస్టాండ్ ముఖద్వారం ఎదుట భారీ ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. మహిళా ప్రజాప్రతినిధికే కనీస గౌరవం లేని ఇదెక్కడి ప్రజాపాలన అంటూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.