A2 న్యూస్, జూన్ 30, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్(29) మైనర్ బాలికపై లైంగిక దాడి, అపహరణకు పాల్పడిన నిందితుడికి పోక్సో ప్రత్యేక న్యాయస్థానం 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఉత్తరప్రదేశ్కు చెందిన రాజ్ కిషోర్ (25) మనోహరాబాద్ మండలంలో అద్దెకు ఉంటూ కూలి పనులు చేసేవాడు. అదే ఇంటి యజమాని 15 ఏళ్ల కుమార్తెతో పరిచయం పెంచుకుని, ప్రేమ పేరుతో ఆమెను నమ్మించి అనంతరం బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లినట్లు ఎస్పీ తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మనోహరాబాద్ పోలీస్ స్టేషన్లో 2023 ఆగస్టులో మిస్సింగ్ కేసు నమోదు చేసి, అనంతరం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు వేగవంతమైన దర్యాప్తు చేపట్టి బాలికను సురక్షితంగా రక్షించి, నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసులో అప్పటి తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి సమగ్ర దర్యాప్తు నిర్వహించి, పటిష్టమైన సాక్ష్యాధారాలతో ఛార్జిషీట్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా పోక్సో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలయ్య బలమైన వాదనలు వినిపించగా, మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్, లైజనింగ్ ఆఫీసర్ ఎస్ఐ విఠల్, కానిస్టేబుల్ కృష్ణ, సీడీఓ మహిపాల్ రెడ్డి, భరోసా లీగల్ అడ్వైజర్ శ్వేతా సమన్వయంతో కేసు విచారణకు సహకరించారు. సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన పోక్సో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి శ్రీమతి ఆర్.యం. సుభావాలి నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించారు. ఈ కేసులో సమర్థవంతంగా పనిచేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, మైనర్ బాలికలపై లైంగిక నేరాలకు పాల్పడే వారిని చట్టం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని హెచ్చరించారు. ఇలాంటి కేసుల్లో శాస్త్రీయ దర్యాప్తు, పటిష్టమైన సాక్ష్యాధారాలతో నిందితులకు కఠిన శిక్షలు పడేలా మెదక్ జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. అలాగే తల్లిదండ్రులు పిల్లల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద సంఘటనలు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్-100/112కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.