A2న్యూస్, నర్సాపూర్ (కొల్చారం) ప్రతినిధి (బుచ్చన్న) సెప్టెంబర్ 16:
కొల్చారం (15) చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలో చోటుచేసుకుంది. కొల్చారం మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన చాకలి బిక్షపతి (40), తండ్రి కిష్టయ్య, కులం చాకలి, వృత్తి వ్యవసాయం. ఈ నెల 13వ తేదీ సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో కోనాపూర్ గ్రామ శివారులోని మంజీరా నది వాగులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మెదక్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఫైర్ సిబ్బంది సోమవారం (14.09.2026) ఉదయం సుమారు 8.30 గంటలకు మంజీరా వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం సుమారు 4.50 గంటల సమయంలో బిక్షపతి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చి పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు మంజీరా నది వాగులో మునిగిపోవడం వల్లే బిక్షపతి మృతి చెందినట్లు మృతుడి భార్య చాకలి నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై మొయినుద్దీన్ తెలిపారు. నాగమణి ఫిర్యాదు మేరకు కొల్చారం ఎస్సై మొయినుద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.