A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 6:17 am Posted by : A2TV NEWS

కేజీబీవీ టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాం: అదనపు కలెక్టర్ నగేష్

A2న్యూస్, జూలై 15, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా (14) జిల్లా కేంద్రం కస్తూరిబా  గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) మరియు ఇతర సంక్షేమ విద్యాసంస్థలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించినట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. గతంలో జారీ చేసిన ప్రకటన మేరకు కోడ్ చేసిన గుత్తేదారుల సమక్షంలో కలెక్టరేట్‌లోని అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో టెండర్లను నిర్వహించారు. జిల్లాలోని 19 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, 6 తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల వసతిగృహాలు, ఒక అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్‌కు అవసరమైన చికెన్, మటన్, కూరగాయలు, పండ్ల సరఫరా కోసం టెండర్లను పారదర్శకంగా పూర్తి చేశారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ లాటరీ విధానంలో గుత్తేదారులను ఎంపిక చేశారు. ఎంపికైన గుత్తేదారులు నాణ్యమైన చికెన్, మటన్, కూరగాయలు, పండ్లను మాత్రమే సరఫరా చేయాలని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన గుత్తేదారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారిని బ్లాక్‌లిస్టులో చేర్చనున్నట్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, ఏఎంఓ సుదర్శన్ మూర్తి, వసతి గృహ సంక్షేమ అధికారులు, ప్రిన్సిపల్స్, గుత్తేదారులు తదితరులు పాల్గొన్నారు.