A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 6:31 am Posted by : A2TV NEWS

మెదక్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి, మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి

ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 16:

మెదక్ (15) మెదక్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు పండుగ వాతావరణంలో అట్టహాసంగా సాగాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి, మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికార ప్రముఖులను కలిసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ మెదక్ జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వివరించారు. వివిధ ప్రభుత్వ శాఖలు అమలు చేస్తున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ స్టాళ్లను మంత్రి సందర్శించారు. వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక, అటవీ, విద్య, వైద్యారోగ్య, మహిళా శిశు సంక్షేమం, మిషన్ భగీరథ, నీటిపారుదల, సమగ్ర శిక్ష అభియాన్ తదితర శాఖల స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. వివిధ విభాగాల్లో పతకాలు సాధించిన పోలీసు సిబ్బందికి మెడల్స్ ప్రదానం చేశారు. స్వాతంత్ర్య సమరయోధులు, వారి కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాఠశాలల చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశభక్తి, జాతీయ స్ఫూర్తిని ప్రతిబింబించే గేయాలకు చిన్నారులు చక్కటి అభినయంతో ప్రదర్శనలు ఇచ్చి ఆహుతులను ఆకట్టుకున్నారు. చిన్నారుల ప్రదర్శనలకు మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డీఆర్వో అంబాదాస్ రాజేశ్వర్, మెదక్ ఆర్డీవో రమాదేవి, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, స్వాతంత్ర్య సమరయోధులు, విద్యార్థినీ విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.