A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 5:56 am Posted by : A2TV NEWS

సత్యసాయి ఆగ్రో రైస్ మిల్లులో భారీ అవకతవకలు.. రూ.7.17 కోట్ల విలువైన ధాన్యం గల్లంతు

A2న్యూస్, జూలై 22, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ (21) మెదక్ జిల్లా కుల్చారం మండలంలోని శ్రీ సత్యసాయి ఆగ్రో రైస్ మిల్ ఇండస్ట్రీస్‌లో అధికారులు నిర్వహించిన సంయుక్త తనిఖీల్లో భారీ స్థాయిలో ధాన్యం కొరత బయటపడింది. ఈ విషయాన్ని జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ బృందం, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు, అసిస్టెంట్ పౌర సరఫరాల అధికారి, సివిల్ సప్లై ఇన్‌స్పెక్టర్‌లు సంయుక్తంగా జూలై 20న రైస్ మిల్లును తనిఖీ చేశారు. తనిఖీల్లో ఖరీఫ్ 2025–26 సీజన్‌కు సంబంధించిన 3,029.960 మెట్రిక్ టన్నుల ధాన్యం (75,749 బస్తాలు) నిల్వల్లో లేకపోవడం గుర్తించారు. గల్లంతైన ధాన్యం విలువ 7,17,79,752.40గా అధికారులు అంచనా వేశారు. ఈ ఘటనపై రైస్ మిల్ యజమాని డి. శ్రీనివాస్పై నిత్యావసర వస్తువుల చట్టం (EC Act-1955) సెక్షన్ 6-ఏ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తదుపరి చర్యల కోసం పూర్తి నివేదికను మెదక్ జిల్లా కలెక్టర్‌కు సమర్పించినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద వెల్లడించారు.