A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 4:16 pm Posted by : A2TV NEWS

పోలీసు సిబ్బందికి ఉచిత ఆరోగ్య శిబిరం

A2 న్యూస్, జూన్ 16, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

పోలీసుల సంక్షేమమే లక్ష్యంగా హెల్త్ క్యాంప్ – ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

ప్రజల భద్రత కోసం నిరంతరం విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మంగళవారం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆక్సిస్ బ్యాంక్ సహకారంతో యశోద హాస్పిటల్ వైద్య బృందం ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బందికి ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు.

ఈ శిబిరంలో రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులతో పాటు పలు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వైద్యులు ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన సూచనలు అందించి, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఆరోగ్యంగా ఉన్నప్పుడే విధులను సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమన్నారు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, సరిపడా విశ్రాంతి తీసుకోవడం వంటి మంచి అలవాట్లు అలవరుచుకోవాలని సూచించారు.

అలాగే ధూమపానం, మద్యపానం వంటి హానికర అలవాట్లకు దూరంగా ఉండాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్న ఆయన, విధి నిర్వహణలో ఒత్తిడి లేదా కుటుంబ బాధ్యతల వల్ల కలిగే మానసిక సమస్యలను సానుకూలంగా ఎదుర్కోవాలని తెలిపారు. అవసరమైతే సహచరులు, కుటుంబ సభ్యులు లేదా ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలను పంచుకోవాలని సూచించారు. పోలీసు సిబ్బంది ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటేనే కుటుంబంతో పాటు శాఖకు మరింత సమర్థవంతమైన సేవలు అందించగలరని ఎస్పీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ శైలేందర్, ఆక్సిస్ బ్యాంక్ ప్రతినిధులు, యశోద హాస్పిటల్ వైద్యులు, పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.