2.93 కోట్లతో పలు వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
ప్రతి వార్డుకు సమాన అభివృద్ధి.. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
A2న్యూస్, జులై 15, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా (14) మెదక్ పట్టణ సమగ్రాభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడిందని మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. రూ.2.93 కోట్ల వ్యయంతో పట్టణంలోని 31, 30, 23, 22, 20, 16, 17, 18, 19, 21, 28 వార్డుల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణ పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి అభివృద్ధి పనులపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “మెదక్ నియోజకవర్గ అభివృద్ధే నా లక్ష్యం. ప్రజలు నాపై ఉంచిన విశ్వాసానికి తగ్గట్టుగా ప్రతి వార్డులో సమాన అభివృద్ధి జరిగేలా కృషి చేస్తున్నాం. రహదారులు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని తెలిపారు.
ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని ప్రాంతాల్లో ప్రస్తుతం సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతుల పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రజల అవసరాలను గుర్తించి దశలవారీగా ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. మెదక్ పట్టణాన్ని ఆధునిక మౌలిక వసతులతో కూడిన ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కోట్ల రూపాయల నిధులు తీసుకువస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే తన ధ్యేయమని, ఏ వార్డు వెనుకబడకుండా సమాన అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని పేర్కొన్న ఎమ్మెల్యే, అధికారులు, కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలు కూడా పనుల నాణ్యతను పర్యవేక్షిస్తూ తమ సూచనలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, స్థానిక ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.