A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) ఆగస్టు 26 :
మనోహరాబాద్ (25) కాళ్లకల్ గ్రామానికి చెందిన ప్రముఖ పెయింటర్ కనిగిరి సుదర్శన్ (56) అనారోగ్యంతో మృతి చెందారు. గత మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి గ్రామస్తులు, స్నేహితులు, ఆత్మీయులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. కనిగిరి సుదర్శన్ గత 30 ఏళ్లుగా పెయింటింగ్ వృత్తిని కొనసాగిస్తూ గ్రామంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. గ్రామంలో పెయింటింగ్ కళలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉండేదని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. దేవాలయాలకు ఆయన వేసిన చిత్రాలు, రాతలు, వివిధ కళాకృతులను ఎప్పటికీ మర్చిపోలేమని తెలిపారు. సుదర్శన్కు ఇద్దరు కుమారులు పృథ్వీతేజ, సాయితేజతో పాటు ఒక కుమార్తె ఉన్నారు. మూడేళ్లుగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందడంతో కుటుంబంపై అనేక బాధ్యతలు పడినట్లు బంధువులు తెలిపారు. చిన్న వయసులోనే పిల్లలు కుటుంబ బాధ్యతలను ఎదుర్కోవాల్సి రావడం బాధాకరమన్నారు. సుదర్శన్ కేవలం పెయింటర్గా మాత్రమే కాకుండా భక్తి, భజన పాటలు పాడుతూ తబలా వాయించేవారని స్నేహితులు తెలిపారు. రాజకీయాల్లోనూ యువ నాయకుడిగా చురుకుగా వ్యవహరించి సర్పంచ్గా పోటీ చేసినట్లు గుర్తు చేశారు. ప్రతి ఒక్కరితో మర్యాదగా, ఆప్యాయంగా మెలిగేవారని పేర్కొన్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఏడుగురు అన్నదమ్ముల్లో ఒకరిని కోల్పోవడం కుటుంబ సభ్యులకు తీరని లోటుగా మారిందని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. తల్లి తన కుమారుడి మృతిని జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరుగా విలపించారు. సుదర్శన్ పార్థివదేహాన్ని అన్ని పార్టీల నాయకులు, స్నేహితులు, గ్రామస్తులు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని వారు ఆకాంక్షించారు.