అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రతిమా సింగ్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 8:
మెదక్ జిల్లా (7) ఖనిజాల లీజుల ద్వారా ప్రభుత్వ రెవెన్యూ ఆదాయాన్ని గణనీయంగా పెంచేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని వీడియో సమావేశ హాలులో అదనపు కలెక్టర్ నగేష్తో కలిసి రెవెన్యూ, మైనింగ్, భూముల కొలతలు, ఇరిగేషన్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సున్నపురాయి, మాంగనీస్, ఇనుప ఖనిజం, లిథియం తదితర ప్రధాన ఖనిజాల లీజులను వేలం ద్వారా మాత్రమే కేటాయించేలా భారత ప్రభుత్వం 2015లో (ఎంఎండీఆర్ ) చట్టాన్ని సవరించిందన్నారు. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జీఓఎంఎస్ నెం.26, తేదీ 31-03-2022 ద్వారా ముడి రాయి, రోడ్డు మెటల్, భవన నిర్మాణ రాయి, డోలమైట్ తదితర చిన్న ఖనిజాల క్వారీ లీజులను కూడా వేలం ఆధారంగా మంజూరు చేయడం తప్పనిసరి చేస్తూ తెలంగాణ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్, 1966ను సవరించిందని వివరించారు. ఖనిజ వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు ఈ-వేలం విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. ఖనిజ బ్లాకుల గుర్తింపు, వేలం ప్రక్రియ, అవసరమైన అనుమతులు, క్లియరెన్స్ల పర్యవేక్షణను ఒకే డిజిటల్ పోర్టల్ ద్వారా పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ ఆదాయం సమకూర్చే వనరులపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని, నిర్దేశించిన లక్ష్యాల సాధనలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో ఏడీ మైన్స్ నాగరాజు, ఏడీ ల్యాండ్ సర్వే కిషన్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఇరిగేషన్ రంజిత్ కుమార్, ఆర్డీవోలు, తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.