A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 6:59 am Posted by : A2TV NEWS

వసతి గృహాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, జూలై 24, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

చిన్న శంకరంపేట (23) వసతి గృహాల్లో విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేలా ప్రతిరోజూ శుభ్రత చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ హాస్టల్ నిర్వాహకులను ఆదేశించారు. గురువారం చిన్న శంకరంపేట మండల క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా షెడ్యూల్ కులాల (ఎస్సీ) బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లోని వంటగది, స్టోర్‌రూమ్‌ను పరిశీలించి ఆహార పదార్థాల నిల్వ విధానం, పరిశుభ్రతను తనిఖీ చేశారు. అనంతరం హాస్టల్ ఆవరణ, డ్రైనేజీ వ్యవస్థ, మరుగుదొడ్లు, విద్యార్థుల గదులు తదితర సౌకర్యాలను పరిశీలించారు. అలాగే హాస్టల్‌లోని విద్యార్థుల సంఖ్య, సిబ్బంది వివరాలను వార్డెన్‌ను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హాస్టల్‌లో ప్రతిరోజూ శుభ్రత చర్యలు చేపట్టి, మరుగుదొడ్లు, గదులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. హాస్టల్ పరిసరాల్లో మొక్కలను క్రమపద్ధతిలో పెంచి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిగ్రేటెడ్ నిధులను సమర్థవంతంగా వినియోగించి అవసరమైన సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. విద్యార్థులకు తగినంత వెలుతురు ఉండేలా అదనంగా ట్యూబ్‌లైట్లు ఏర్పాటు చేయాలని, హాస్టల్‌లోకి బయటి వ్యక్తులను అనుమతించరాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ తులసీరామ్, ఎంపీడీవో దామోదర్, సర్పంచ్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.