A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 6:28 am Posted by : A2TV NEWS

బాలికల సంరక్షణ అందరి బాధ్యత : జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 1:

మెదక్ జిల్లా (31) బాలికల రక్షణ, విద్య, సమానత్వం, సాధికారతకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. బాలికలకు సమాన అవకాశాలు కల్పించడం, వారి విద్యను ప్రోత్సహించడం, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా బేటీ బచావో – బేటీ పడావో (బి బి బి పి)కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో ఘనంగా రాఖీ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులకు రాఖీలు కట్టి బాలికల రక్షణ, విద్య, గౌరవం, సమానత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలనే సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలికల హక్కులు, భద్రత, విద్య, భవిష్యత్ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తోందన్నారు. బాలికలు అన్ని రంగాల్లో ముందుకు సాగేలా వారికి అవసరమైన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాఖీ వేడుకలు అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలవడంతో పాటు, బాలికల భద్రత, గౌరవాన్ని కాపాడాలనే సామాజిక బాధ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దోహదపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. “బాలికలను రక్షిద్దాం – బాలికలను చదివిద్దాం” అనే బి బి  బి పి సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లేందుకు కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి హేమా భార్గవి, విద్యార్థినులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.