మండల స్థాయిలో ప్రజావాణి యథావిధిగా కొనసాగింపు
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 17:
మెదక్ జిల్లా (16) జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం (17-08-2026) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు మరియు భూగర్భ శాస్త్ర శాఖల మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో జిల్లా అధికారులు తమకు కేటాయించిన విధుల్లో నిమగ్నమై ఉండనున్నందున, కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఒకరోజు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అయితే ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణ యథావిధిగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. అలాగే మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం కూడా ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని ఆమె కోరారు.