A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 6:29 am Posted by : A2TV NEWS

వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి

మండపాల నిర్వాహకులతో సమన్వయంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ముందస్తు చర్యలు

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 8:

మెదక్ జిల్లా ( 7) వినాయక చవితి, గణేష్ నవరాత్రి ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలు, భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో ఎస్పీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి గణేష్ మండపం వద్ద భద్రతా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని, మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులతో పోలీసులు నిరంతరం సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. గణేష్ విగ్రహాల నిమజ్జనం, ఊరేగింపు మార్గాలను ముందుగానే పరిశీలించి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను సిద్ధం చేయాలని తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో తగినంత పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఊరేగింపుల్లో డీజేలు, అధిక శబ్దం, రెచ్చగొట్టే నినాదాలు, మద్యం సేవించి పాల్గొనడం వంటి అంశాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ స్పష్టం చేశారు. రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా కొనసాగించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను ముందుగానే గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.వినాయక ఉత్సవాలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ప్రజలు, ఉత్సవ కమిటీలు పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు. పోలీస్ శాఖ సూచించిన భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మెదక్ డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సీఐలు మహేష్, కృష్ణమూర్తి, రాజశేఖర్ రెడ్డి, జార్జ్, ఆర్‌ఐలు శైలేందర్, రామకృష్ణ, ఎస్‌ఐలు పాల్గొన్నారు.