వేధింపులు ఎదురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి
బాలికల రక్షణే సమాజ అభివృద్ధికి పునాది: డీఎస్పీ నరేందర్ గౌడ్
A2 న్యూస్, జూన్ 30, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
తూప్రాన్ (29) మహిళలు, బాలికల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఎలాంటి వేధింపులు లేదా అనుమానాస్పద ఘటనలు ఎదురైనా భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ సూచించారు. మెదక్ జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో సోమవారం దాతర్పల్లి టీఎస్డబ్ల్యూఆర్ఎస్ పాఠశాల, కళాశాల హాస్టల్లో విద్యార్థినుల కోసం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా మహిళల భద్రత, బాలికల రక్షణ, సైబర్ నేరాల నివారణ, మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ దుష్పరిణామాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈవ్టీజింగ్, స్టాకింగ్, సోషల్ మీడియా వేధింపులు వంటి ఘటనలను ఏమాత్రం సహించకుండా వెంటనే షీ టీమ్, మహిళా హెల్ప్ డెస్క్ లేదా అత్యవసర సేవ ఈ ఆర్ ఎస్ ఎస్-112ను సంప్రదించాలని సూచించారు. టీ-సేఫ్ (T-Safe) యాప్ వినియోగం, షీ టీమ్ సేవలు, మహిళా హెల్ప్ డెస్క్ ద్వారా అందుతున్న రక్షణ చర్యలను వివరించారు. సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, పాస్వర్డ్లు ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు. సైబర్ నేరస్థులు వివిధ మార్గాల్లో యువతను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేటి బాలికలే రేపటి సమాజానికి బలమైన పునాది అని పేర్కొన్న డీఎస్పీ, తమ హక్కులు, చట్టపరమైన రక్షణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఎలాంటి బెదిరింపులు లేదా వేధింపులు ఎదురైనా భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఎస్ఐ గంగా రాజు, షీ టీమ్ సిబ్బంది, పాఠశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.