A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 5:20 pm Posted by : A2TV NEWS

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

A2 న్యూస్, జూన్ 16, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి గ్రామానికి చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, పులిమామిడి గ్రామానికి చెందిన గజ్వేల్ అరవింద్ (20), తండ్రి స్వామి కుమారుడు, ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రోజువారీ మాదిరిగానే సోమవారం (జూన్ 15) విధులకు వెళ్లిన అరవింద్, రాత్రి 10:30 గంటల సమయంలో తన ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు.

మార్గమధ్యంలో ఇబ్రహీంపూర్ వడ్డెర కాలనీ సమీపంలో రోడ్డుపై ఎలాంటి హెచ్చరిక సూచికలు (ఇండికేటర్లు) ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా నిలిపి ఉంచిన ట్రాక్టర్‌ను గమనించలేక వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అరవింద్ ముఖానికి తీవ్ర గాయాలు కావడంతో ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి గజ్వేల్ రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ను రోడ్డుపై నిర్లక్ష్యంగా నిలిపివేయడమేనని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.